కోస్తా వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. అప్రమత్తమైన యంత్రాంగం..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది వచ్చే 12 గంటల్లో తీవ్రంగా మారే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ శాక తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీర సమీపంలోకి వస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్లు, నర్సాపూర్కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి నర్సాపూర్-విశాఖ మధ్య కాకినాడకు సమీపంలో మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.
వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 20 సెంటిమీటర్ల కన్నా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని విపత్తుల శాఖ తెలియజేసింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగ్రాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంది అని.. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.