కుట్ర: బాబుని ఏకేసిన హరీష్, కేసీఆర్తో సైరస్ మిస్త్రీ
నల్గొండ/హైదరాబాద్: పవర్ ప్రాజెక్టులు అన్నింటిని ఆంధ్రాలో నిర్మించడం వల్లే తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ కష్టాలు వచ్చాయని, తెలంగాణ పైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కుట్ర జరిగిందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా వెనుకబడిందన్నారు. నాగార్జున సాగర్ నుండి ఎడమ కాలువకు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిలు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు.
లోయర్ సీలేరు నుండి తెలంగాణకు విద్యుత్ వాటా ఇవ్వడం లేదని విమర్శించారు. ఉద్యోగుల విభజన బిల్లు ప్రధాని వద్దనే ఉందని, దీని పైన బీజేపీ నేతలు స్పందించాలన్నారు. నీళ్ల విషయంలో నాగార్జున సాగర్ నుండే తెలంగాణపై కుట్రకు బీజం పడిందన్నారు. కృష్ణా జలాల విషయంలో కొత్త ట్రైబ్యునల్ వేసి నాలుగు రాష్ట్రాలకు జల పంపకాలు చేయాలన్నారు.
కుట్రపూరితంగా చంద్రబాబు తెలంగాణను చీకట్లోకి నెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అవసరం లేకున్నా వీటీపీఎస్, ఆర్టీపీపీ సామర్థ్యం పెంచారన్నారు. కృష్ణా, గోదావరి నదుల విషయంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కుట్ర జరిగిందన్నారు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పుష్కరాలు జరుపుతామన్నారు.
తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తున్న చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు నిలదీయాలన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు తమ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కేంద్రం, చంద్రబాబును నిలదీసి తెలంగాణకు రావాల్సిన హక్కులు, విద్యుత్ వాటాను కోరుతాం రావాలని బీజేపీ, టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ను కలిసిన సైరస్ మిస్త్రీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బుధవారం సచివాలయంలో పలువురు ప్రముఖులు కలిశారు. టాటా గ్రూప్ ఎండీ సైరస్ మిస్త్రీ సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇక, సచివాలయంలో.. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్, గుత్తా జ్వాలా, పీవీ సింధు, గురుసాయి దత్, గగన్ నారంగ్ తదితరులు కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను కలిశారు.