మైండ్ బ్లాంకైంది: ప్రత్యర్థులపై హరీశ్, నమ్మరన్న కెకె
హైదరాబాద్: ఇటీవల విడుదలైన సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకుల మైండ్ బ్లాంకైయ్యాయని టిఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనమయ్యేలా ఉంటే సోనియా గాంధీ ఆడిస్తున్నారని.. విలీనం కాకపోతే కావడం లేదని చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినా ప్రజలు బానిసలా ఉండాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ తమకు సామాంత రాజ్యాంగ ఉండాలని చంద్రబాబు పార్టీ కోరుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. టిఆర్ఎస్ అస్తిత్వం ఉన్న పార్టీ అని, తమ పార్టీకి తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తమ పార్టీనేనని ఆయన అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. సీమాంధ్ర పార్టీలు దివాళకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
అమరుల సంతాపానికీ అంగీకరించలేదు: కాంగ్రెస్ నేతలపై కెకె
తెలంగాణ కోసం అమరులైన వారికి సంతాపం తెలిపేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయించలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తామే తెలంగాణ తెచ్చామంటే ఎవరు నమ్ముతారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కె కేశవరావు అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితో కోట్లాట పెట్టుకోవడం ఎందుకని కాంగ్రెస్ నాయకులు వెనక్కి పోయారని ఆరోపించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని చెప్పారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే వరకు మాట్లాడని కాంగ్రెస్ నాయకులు తామే తెచ్చామని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఇంతవరకు తాను హుందాతనంగా వ్యవహరించానని, కాంగ్రెస్ పార్టీలోని తన మిత్రులు అనవసరంగా నోరు పారేసుకోవద్దని సూచించారు. గతంలో తెలంగాణకు నై అన్నవాళ్లే ఇప్పుడు తెలంగాణ కోసం మేమే పోరాడామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. 13ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్యమంలో ప్రజలే ముఖ్యంగా పని చేశామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులతో విభేదించేందుకు వెనకాడబోమని చెప్పారు
కాగా, సోమవారం మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఖమ్మం జిల్లా నాయకుడు జలగం వెంకటరావు, కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పుట్ట మధు సోమవారం తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలో చేరారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటరావు, పుట్ట మధు మాట్లాడుతూ.. బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.