నోరు అదుపులో పెట్టుకో: జైరాంపై దుమ్మెత్తిపోసిన హరీష్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారన్నారు. రెండు పార్టీల మధ్య అంతరం పెంచేలా జైరామ్ వ్యవహరిస్తుని ఆరోపించారు. తెలంగాణ రాగానే.. హైదరాబాద్ వచ్చిన జైరామ్... తనకు తెలంగాణ రావడం ఇష్టం లేదని చెప్పారని అన్నారు. అలా అనటం కేంద్రం, కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లే అన్నారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణ జెఏసి నేతలకు టిక్కెట్లు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్... ఉద్యమం సమయంలో ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగాలను కేసులు పెట్టి, వేధించి కోర్టుల చుట్టు తిప్పిందన్నారు. జైరామ్ మిడిమిడి జ్ఞానంతో తెరాసపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణపై, తెరాసపై విషం కక్కుతున్నారన్నారు. జైరామ్ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని, మనిషిని చంపి పూలు చల్లినట్లుగా ఉందన్నారు.
జైరామ్ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెసు పార్టీని నిండా ముంచుతాయన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెరాసను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఓ వైపు తెరాసతో పొత్తులు వద్దని మంత్రులతో లేఖలు రాయిస్తూ తెరాసను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని, తెరాస తెలంగాణలో బలమైన పార్టీ అన్నారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ అన్నారు. జైరామ్ శకునిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో ఐకాస బలపర్చిన అభ్యర్థులపై అభ్యర్థులను నిలబెట్టింది కాంగ్రెస్సే కదా అన్నారు. జైరామ్ నోటీని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఉద్యమం సమయంలో జెఏసి ఇచ్చిన పిలుపును కాంగ్రెసు పట్టించుకోలేదన్నారు. జైరామ్ తెలంగాణ ప్రజల పట్ల విలన్గా మారారన్నారు. పార్లమెంటు పక్కన ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి శవాన్ని చూసేందుకు కూడా జైరామ్ రాలేదన్నారు.
ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా కాకుండా జనాభా ఆధారంగా చేస్తున్నారని, అలా అయితే తెలంగాణ నిరుద్యోగులకు నష్టమన్నారు. పోలవరం విషయంలో తెలంగాణకు అన్యాయం జైరామ్ వల్లే జరిగిందన్నారు. ఎపి భవన్ తెలంగాణకు రాకపోవడానికి కూడా ఆయనే కారణమన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications