బాబు 5కోట్లకేనని చెప్పారు: ఏపీ ప్రజల్ని మెచ్చుకున్న హరీష్
హైదరాబాద్: తాను ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతినిధి అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు ఆ పార్టీని వీడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంగళవారం అన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కోవడంతో టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ ప్రజలు తెలివైనవారన్నారు.
చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరన్నారు. హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారని చెప్పారు. తాను ఐదు కోట్ల మందికి ప్రతినిధిని అని చంద్రబాబు చెప్పాక, తెలంగాణ టీడీపీ నేతలు ఇంకా ఆ పార్టీలో ఎలా కొనసాగుతారో చెప్పాలన్నారు.
మామను వెన్నుపోటు పొడిచి డబ్బు సంచులతో చంద్రబాబు రాజకీయాలు చేశాడన్నారు. ఎప్పుడు డబ్బు సంచుల రాజకీయాలు నడవవని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయన్నారు.
చంద్రబాబు 5 కోట్ల ఆంధ్రులకు ప్రతినిధి కానీ, తెలంగాణ ప్రజలకు కాదన్నారు. డబ్బుకు ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తూ అడ్డంగా బుక్కయ్యారన్నారు. సిగ్గుమాలిన రాజకీయాలు టీడీపీ నేతలు మానుకోవాలన్నారు. అడ్డంగా దొరికి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పడం విడ్డరమన్నారు.
బాబుది నీచ రాజకీయ చరిత్ర: ఇంద్రకరణ్
చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడ్డారని మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రలోను చంద్రబాబును జనం ఛీకొడుతున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా నీచ రాజకీయ చరిత్రే అన్నారు. చంద్రబాబును ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు చేయాలన్నారు.