టీలో సంస్థకు నువ్వెలా, కయ్యం వద్దు: బాబుని ఏకేసిన హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్రం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీల పైన కేంద్రానికి స్పష్టత లేదన్నారు. స్మార్ట్ సిటీల కోసం ఇంకా కేంద్రం నుండి మార్గదర్శకాలు రాలేదన్నారు.
చంద్రబాబు పైన హరీష్ రావు మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణతో కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. బాబు రెచ్చగొట్టే చర్యలు రెండు రాష్ట్రాలకు మంచిది కాదన్నారు. హైదరాబాదులో న్యాక్కు చంద్రబాబు చైర్మన్ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. తెలంగాణతో రోజుకో కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న సంస్థ న్యాక్కు తానే చైర్మన్ను అని చంద్రబాబు ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు.
హైదరాబాదులోని న్యాక్కు తానే చైర్మన్ను అని ప్రకటించుకోవడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనం అన్నారు. న్యాక్కు చైర్మన్గా చంద్రబాబు ఉండటాన్ని టీడీపీ నేతలు సమర్థిస్తారో లేక వ్యతిరేకిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటున్నారన్నారు.
చంద్రబాబు చెప్పేవి నీతి మాటలు, చేసేవి రోత పనులు అన్నారు. చంద్రబాబు తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణలోని న్యాక్కు బాబు చైర్మన్ను నియమించడమేమిటన్నారు. ఈ ఉత్తర్వు జారీ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. టీటీడీ చైర్మన్గా తాము జీవో తెస్తే వారు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. న్యాక్ విభాగాలు హైదరాబాదుతో పాటు ఆంధ్రా ప్రాంతంలోను ఉన్నాయన్నారు. ఆయన అక్కడ ఉండవచ్చునన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు ప్రేమ రైతుల మీద కాదన్నారు. వారి దృష్టి రాజకీయం మీదే ఉందన్నారు. నిన్న శంషాబాద్ విమానాశ్రయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టారని, ఇప్పుడు న్యాక్కు చైర్మన్గా తనను ప్రకటించుకున్నారని, ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీడీపీ నేతలు దీనిని కూడా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే టీడీపీ నేతలు ఆ పార్టీలో ఎలా ఉంటున్నారన్నారు.