టి: కేంద్రంపై హర్ష ఆగ్రహం, టి కాంగ్ డిమాండ్స్ ఇవి..
న్యూఢిల్లీ: విభజనపై వేగంగా అడుగులు వేస్తుండటంతో అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ సోమవారం మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలు దేశ పౌరులే కాదన్నట్లుగా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అందరు సమైక్యానికే కట్టుబడి ఉన్నారన్నారు. హైదరాబాదుపై సీమాంధ్రుల భయాందోళనలను తొలగించాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం మంత్రుల బృందంతో(జివోఎం) సీమాంధ్ర కాంగ్రెసు నేతలు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో వారు కేంద్రమంత్రి పళ్లం రాజు ఇంట్లో భేటీ అయ్యారు.
ఈ భేటీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డి, వట్టి వసంత్ కుమార్, కిల్లి కృపారాణి, కావూరి సాంబశివ రావు, జెడి శీలం, చిరంజీవి, రాయపాటి సాంబశివ రావు, కెవిపి రామచంద్ర రావు, పురంధేశ్వరి తదితరులు భేటీ అయ్యారు.
తెలంగాణ నేతల డిమాండ్స్
మరోవైపు ఉదయం పదిగంటలకు తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లు జివోఎం ఎదుట హాజరయ్యారు.
పది జిల్లాల తెలంగాణ, ఆంక్షలు లేని హైదరాబాద్, రెవెన్యూ డివిజన్ పరిధి వరకే ఉమ్మడి రాజధాని, తెలంగాణలో భద్రాచలం అంతర్భాగం వంటి పలు డిమాండ్లు నివేదికలో పొందుపర్చారు. కృష్ణా జలాల కేటాయింపు యథావిధిగా ఉండాలని, గోదావరి జలాలపై కేంద్రం అజమాయిషీ అవసరం లేదని, హైదరాబాదు ఆదాయ పంపిణీకి అంగీకరించమని, విద్యుదుత్పత్తి పదేళ్ల పాటు ప్రస్తుత పరిస్థితి కొనసాగించాలని అందులో పేర్కొన్నారు. పోలవరం ముంపుపై అభ్యంతరాలు ప్రస్తావించారు. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతలు తెలంగాణ సిఎం అధ్యక్షుడిగా ఇరు రాష్ట్రాల డిజిపిలతో ఏర్పాటు చేయాలి.