అరచేతిలో స్వర్గం, బినామీ భూబాగోతం: బాబుపై హర్షకుమార్ లేఖాస్త్రం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని పేరిట ఏపీ ప్రజలకు చంద్రబాబునాయుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబు పాలన రాజధానికే పరిమితమా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఒక లేఖ రాశారు. రాజధాని నిర్మాణంలో ఏ లొసుగులున్నాయో తెలియడం లేదని అన్నారు. ఇంతకుముందు సింగపూర్ అన్న చంద్రబాబు.. ఇప్పుడు జపాన్ అంటున్నారని విమర్శించారు.
విదేశీ టూర్ల పేరిట ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బాబు విస్మరించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చంద్రన్న పేరు పెట్టుకోవడం సిగ్గు చేటని హర్షకుమార్ తన లేఖలో మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా తన బినామీలకు బాబు అక్రమంగా భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు, కాలేజీల నుంచి ముడుపులు తీసుకుంటూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.