ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా? నారా లోకేష్ ఆగ్రహం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మరింత రసవత్తరంగా మారాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత, కోర్టు ముందు హాజరు పరచడం, కోర్టు చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారాయి. చంద్రబాబు నాయుడు తనపై పెట్టిన కేసులలో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు చంద్రబాబుతో ములాఖత్ అయ్యి భవిష్యత్తు రాజకీయాలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళతామని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసిపి గద్దె దిగే వరకు, వైయస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన టిడిపి, వరుస నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు కోసం ఆందోళనలు చేస్తున్న వారిపై వైసిపి ప్రభుత్వ హయాంలోని పోలీసులు జులుం చెలాయిస్తున్నారని నారా లోకేష్ తీవ్రంగా మండిపడుతున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న విజయవాడలో వివిధ కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అని నారా లోకేష్ మండిపడ్డారు. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా? చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న విజయవాడలో వివిధ కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోంది.… pic.twitter.com/t33wI8b6nQ
— Lokesh Nara (@naralokesh) September 15, 2023
తరగతులు సస్పెండ్ చేయించి కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం అంటూ లోకేష్ విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలపాలి అనుకుంటున్న వారిపై నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉధృతం అవుతుంది, అని గుర్తుంచుకోండి సైకో పాలకులారా! అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పాలకులకు హెచ్చరిక జారీ చేశారు.
అంతేకాదు ట్విట్టర్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జారీ చేసిన సర్కులర్ ను ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి తరగతులు క్యాన్సిల్ చేశామని విద్యార్థులంతా తక్షణమే ఇళ్లకు వెళ్లాలని, ఎటువంటి రాస్తారోకోలు, ర్యాలీలలోనూ, ధర్నాలలోనూ, ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనవద్దని ఆ సర్కులర్ లో ఉంది. ఇక ఈ సర్కులర్ ని పోస్ట్ చేసిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా అంటూ సూటిప్రశ్న వేశారు.












Click it and Unblock the Notifications