సభలోకి అడుగుపెట్టేనా?: తప్పుచేసి కోర్టుకు వస్తే ఏం చేయలేం.. రోజాకు హైకోర్టు చురక
హైదరాబాద్: ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అని, చిన్న పొరపాటును ఆసరాగా చేసుకొని వేటు పడిన సభ్యులు కోర్టుకు వచ్చినా ఫలితం ఉండదని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నాడు వ్యాఖ్యానించింది. రోజాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
రోజా సస్పెన్షన్ను సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించిన తీర్పు దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే ఉదయం పదిన్నర గంటల సమయంలో తీర్పును చదవడం ప్రారంభించిన డివిజన్ బెంచ్ పన్నెండున్నర గంటలకు దానిని ముగించింది.
ఈ సందర్భంగా కోర్డు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అసెంబ్లీలో నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ సభ్యులు చేసే వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కు సభకే ఉంటుందని పేర్కొంది.
అదే సమయంలో ఏదో చిన్న పొరపాటును ఆసరా చేసుకుని సస్పెన్షన్ వేటుపడిన సభ్యులు కోర్టులను ఆశ్రయించిన ఫలితం ఉండదని పేర్కొది.
ఈ సందర్భంగా హౌస్ రూల్స్లోని సెక్షన్ 212ను ప్రస్తావించిన బెంచ్.. చట్ట సభలు తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించలేవని స్పష్టం చేసింది. కేవలం సాంకేతిక అంశాలను కారణంగా చూపుతూ సభ్యులు చట్ట సభలు తీసుకునే చర్యల నుంచి తప్పించుకోలేరని పేర్కొంది. శాసన సభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, రోజా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా వద్దా అనేది సభ నిర్ణయించనుంది.
రోజాను రూల్ 340(2) కింద అసెంబ్లీ సస్పెండ్ చేసింది. అయితే, ఈ రూల్ కింద ఒక సెషన్కు మాత్రమే సస్పెన్షన్ విధించే అవకాశముంది. అయితే, అసెంబ్లీలో ఇష్టారీతిన వ్యవహరించి, పొరపాటు చేసిన రూల్ను చూపించి తప్పించుకోలేరని హైకోర్టు అభిప్రాయపడింది. ఇది చంద్రబాబుకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు. సింగిల్ బెంచ్ తీర్పు నేపథ్యంలోనే ప్రభుత్వం జాగ్రత్త పడి రూల్ 212ను ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే అనిత పట్ల రోజా అనుచితంగా ప్రవర్తించారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే అనితకు, సభకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. అప్పుడు కానీ సభ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.
సుప్రీం కోర్టుకు వెళ్తాం: వైసిపి
రోజా ఇష్యూపై సుప్రీం కోర్టుకు వెళ్తామని వైసిపి లీగల్ సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు గడప తొక్కడం ఖాయమని, కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. డివిజన్ బెంచ్ తీర్పు కాపీ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సవాల్ చేస్తామన్నారు.