ఢిల్లీలో వైయస్ జగన్: ఆస్తుల కేసులో హైకోర్టులో మరో ఐఏఎస్ అధికారికి ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆదిత్యనాథ్ పైన సీబీఐ మోపిన అభియోగాలని కొట్టి వేసింది.
ఆదిత్యనాథ్ను సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఆదిత్యానాథ్ 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇండియా సిమెంట్కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు ఉన్నాయి.
కాగా, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఏపీలో విపక్షాలకు చెందిన ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోందని ఆరోపిస్తూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు.
గత కొన్నాళ్లుగా జగన్ ఆస్తుల కేసు విషయంలో అధికారులకు వరుసగా ఊరట లభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనుకోకుండా ఓ వైపు జగన్ ఢిల్లీలో ఉండగా, మరో అధికారికి ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో అధికారులకు ఊరటపై అధికార తెలుగుదేశం పార్టీ పదేపదే ప్రశ్నిస్తోంది.