భూసేకరణపై వక్రీకరిస్తున్నారు: నారాయణ, వెంకయ్యపై జైరాం మండిపాటు
హైదరాబాద్: భూ సేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. నారాయణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని భూసేకరణ ఉత్తర్వులపై విచారణ జరిగిందని మరో 15 రోజుల వరకు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
పదిహేను రోజుల తర్వాత భూసేకరణ గురించి మాట్లాడతామని కోర్టుకు చెప్పామని నారాయణ తెలిపారు. తమ వాదనలు విన్న అనంతరం రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇంకా భూ సేకరణ చట్టం అమలును ప్రారంభించలేదని, 15 రోజుల తర్వాతే భూ సేకరణ చట్టం అమలు చేస్తామని కోర్టుకు చెప్పామని మంత్రి తెలిపారు.
మే నెలాఖరులోగా 20 వేల ఎకరాల సేకరణ జరుగుతుందని, జూన్ నెలలో 20 నుంచి 25 వేల ఎకరాల భూసేకరణ జరుగుతుందని, ఆ వచ్చే నెలలో మొత్తం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. కొన్న భూములకు ఇప్పటి వరకు రూ. 65 కోట్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 16500 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించినట్లు ఆయన చెప్పారు. రాజధాని డిజైన్లో మార్పులు చేస్తున్నారని, 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకు అవే గ్రామాల్లో అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని నారాయణ చెప్పారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కొత్త సాకులు చెబుతున్నారని, కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్నికాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని వెంకయ్యనాయుడు డిమాండ్ చేయడాన్ని జైరాం రమేష్ తప్పుబట్టారు.
నాటి బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ పునర్విభజన చట్టం 2000లో ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించిందా అని ప్రశ్నించారు. ఆ రాష్ర్టానికి ప్రత్యేక హోదా 2002లో ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం పాటించిన విధానాన్నే మన్మోహన్ సింగ్ సర్కార్ అనుసరించిందని జైరాం అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై 2014 ఫ్రిబవరి 20న రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రకటన చేసిన విషయం వెంకయ్యనాయుడుకు తెలుసునని ఆయన చెప్పారు. ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు.