ఏపీ ఉద్యోగ నేతలకు భారీ ఊరట-సర్కార్ షోకాజ్ నోటీసులపై హైకోర్టు స్టే..
ఏపీలో వైసీపీ సర్కార్ కూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికీ మధ్య నెలకొన్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. గతంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు కేఆర్ సూర్యనారాయణ, ఆస్కార్ రావు వంటి వారికి సర్కార్ షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు.
గవర్నర్ తో భేటీ అయిన వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం తమకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగ సంఘ నేతలకు ఇవాళ ఊరట లభించింది. ప్రభుత్వం ఉద్యోగ నేతలకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై విచారణ జరిపిన హైకోర్టు.. వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వన్ని ఆదేశించింది. అంతే కాదు గవర్నర్ తో భేటీ కావడం ప్రతీ ఒక్కరి ప్రాథమిక హక్కని కూడా స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున చేపడుతున్న సంక్షేమం కారణంగా ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపు దాదాపు ప్రతీ నెలా ఆలస్యమవుతోంది. దీనిపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ఆశ్రయించారు. తమకు సకాలంలో జీతభత్యాలు ఇప్పించేలా చూడాలన్నారు. అయితే ఇది రోసా నిబంధనలకు విరుద్ధమంటూ ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు పంపింది. ఇప్పుడు వాటిపై హైకోర్టు స్టే ఇచ్చింది.












Click it and Unblock the Notifications