ఆమంచిపై సీబీఐ విచారణ-మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో- జడ్డీలపై సోషల్ పోస్టుల కేసు
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కు హైకోర్టులో ఊరట దక్కలేదు. గతంలో జడ్డీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయన్ను విచారించేందుకు సీబీఐ సిద్దమైన తరుణంలో హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఆమంచి కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం హైకోర్టు అంగీకరించలేదు.
జడ్డీలపై సోషల్ పోస్టుల కేసు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని తప్పుబడుతూ గతంలో పలువురు వైసీపీ నేతలు, సానుభూతిపరులు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. పీరంతా అధికార పార్టీ నేతలు కావడం, వీరిపై అంత వేగంగా చర్యలు తీసుకునేందుకు వీల్లేకపోవడంతో సీబీఐ కూడా నత్తనడకన విచారణ సాగించింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో కొంతకాలంగా సీబీఐ గతంలో జడ్డీలపై పోస్టులు పెట్టిన వైసీపీ నేతల్ని కోర్టు ముందుకు తెస్తున్నారు.
ఆమంచిపై సీబీఐ విచారణ
ప్రకాశం జిల్లా వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ను జడ్డీలపై సోషల్ మీడియా పోస్టుల కేసులో విచారణకు సీబీఐ గతంలో ఓసారి నోటీసులు ఇచ్చింది. అప్పట్లో విశాఖ సీబీఐ కార్యాలయానికి విచారణకు రప్పించారు. అయితే అప్పట్లో విచారణ పూర్తికాకపోవడంతో మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయితే తనకు వారం రోజులు గడుపు కావాలని కోరిన ఆమంచి.. వారం ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.
ఆమంచికి దక్కని ఊరట
తనపై నమోదైన సోషల్ మీడియా పోస్టుల కేసులో సీబీఐ విచారణను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆమంచి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు తాత్కాలికంగా అయినా బ్రేక్ వేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ఆమంచి కోరారు. అయితే సీబీఐ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో సీబీఐ వాదనతో ఏకీభివంచిన హైకోర్టు ఇందుకు నిరాకరించింది. అదే సమయంలో సోషల్ మీడియా పోస్టుల కేసులో ప్రతివాదులుగా ఉన్న సీబీఐతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను జూలై 15కు వాయిదా వేసింది.