జేసీ మా సీనియర్, ఆయన వ్యాఖ్యలకు కారణమదే: సుజనా, అవిశ్వాసంపై స్పందన విచిత్రం
న్యూఢిల్లీ: లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు వస్తున్న తరుణంలో తాను పార్లమెంటు సమావేశాలకు హాజరుకానంటే తేల్చి చెప్పిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారంపై మరో ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని చెప్పారు.
Recommended Video
పార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు
జేసీ మా సీనియర్
గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నేత అని సుజనా చౌదరి చెప్పారు. అంతేగాక, జేసీ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
జేసీతో మాట్లాడా.. కారణం అదే..
తాను ఈ రోజు కూడా జేసీ దివాకర్ రెడ్డితో మాట్లాడినట్లు సుజనా చౌదరి తెలిపారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ దివాకర్ రెడ్డి చెప్పారని సుజనా వివరించారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది తమతోనే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు.
బాబు కూడా మాట్లాడుతున్నారు
శుక్రవారం అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరుఅవుతారని భావిస్తున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జేసీతో మాట్లాడుతున్నారని సుజన తెలిపారు.
సుజనా వ్యాఖ్యలు గందరగోళం
కాగా, అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టలేమని తమకు కూడా తెలుసునని సుజన చౌదరి వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేగాక, అది తమ ఉద్దేశం కాదని ఆయన అన్నారు. అన్ని పార్టీల మద్దతును తాము కోరామని,ఎపి అంశాలపై పార్లమెంటులో అందరి మద్దతు కూడగట్టడమే లక్ష్యమని ఆయన అన్నారు.