'ప్రత్యేక' వేడి: హోదాకు చెల్లు చీటి, మట్టి అంటకుండా బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమస్యతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. బుధవారం ఉదయం నుంచి కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తూ ప్రకటన చేయడానికి కసరత్తు చేస్తూ వరుస భేటీలతో వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు. బుధవారంనాడు ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశిస్తూ వచ్చారు. నిజానికి ఈ రోజు ఆ ప్రకటన వెలువడుతుందా అనేది అనుమానంగానే ఉంది.
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే ప్రత్యేక హోదాపై చెలరేగుతున్న వేడి చల్లారుతుందా అనేది కూడా సమస్యగానే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని తాజాగా బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తేల్చేశారు. ప్రత్యేక హోదా కన్నా మించిన సాయం కేంద్రం అందిస్తుందని ఆమె బుధవారంనాడు చెప్పారు.
బుధవారం వరకు జరిగిన భేటీలు ఓ వైపు ఉండగా, సాయంత్రం కూడా భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి, తెలుగుదేశ పార్టీ నాయకుడు సుజనా చౌదరి కూడా ఈ వ్యవహారంలో బిజీగానే ఉన్నారు. సుజనా చౌదరితో పాటు మరో టిడిపి ఎంపి కొనకళ్ల సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.

వారు తన చాంబర్లో ఉండగానే అరుణ్ జైట్లీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ను కలవడానికి వెళ్లారు. సాయంత్రంలోగా ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఢిల్లీ వెళ్లడం కూడా అనుమానంగానే ఉంది.
ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు వార్తలన్నీ మీడియా సృష్టేనని ఆయన అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబును ఒప్పించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉండడంతో ప్యాకేజీకి, అది ఎంత భారీగా ఉన్నాసరే అంగీరిస్తే తనపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద ఢిల్లీ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 9వ తేదీన కాకినాడలో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. దానికి ముందే సమస్యను పరిష్కరించాలనే ఎత్తుగడలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దాన్ని చంద్రబాబు కొలిక్కి రానిస్తారా అనేది కూడా సందేహంగానే ఉంది. ప్రత్యేక ప్యాకేజీకి ఆయన తొలుత అంగీకారం తెలిపినప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తనకు మట్టి అంటకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
వీలైతే ఈ రోజే ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. హోదాకు తగిన నిష్పత్తిలో ఎపికి సాయం చేస్తామని చెప్పారు. దాన్ని బట్టి ప్రత్యేక హోదాకు కేంద్రం చెల్లుచీటి పాడినట్లేనని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications