ట్విస్ట్: భూమా, శిల్పాకు మద్య స్వల్ప వ్యత్యాసమే, సర్వే రిపోర్ట్ ఆసక్తికరం
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థిని ఎంపిక చేయడం టిడిపి అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందనే
నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థిని ఎంపిక చేయడం టిడిపి అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై నిర్వహించే సర్వేలో భూమా వర్గానికి, శిల్పా వర్గానికి స్వల్ప తేడానే కన్పిస్తోంది. దీంతో శాంపిల్స్ సంఖ్య ను మరింత పెంచాలని పార్టీ అధినేత సర్వే నిర్వాహకులకు సూచించారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ తరుణంలో నంద్యాల కేంద్రంగా చేసుకొని భూమా అఖిలప్రియ పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ ఏడాది మార్చిలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి నియోజకవర్గంలో ఎవరిపట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నారనే విషయమై స్పష్టత కోసం టిడిపి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.
ఈ స్థానం నుండి పోటీచేసేందుకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కూడ ఆసక్తిని చూపుతున్నాడు.దీంతో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
కీలకంగా మారిన సర్వే నివేదిక
నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసేందుకు మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అయితే ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో పాటు పలువురు మంత్రులు, పార్టీ నాయకులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందనే విషయమై టిడిపి సర్వేనిర్వహిస్తోంది.
ఈ సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. అయితే భూమా కుటుంబం నుండి అభ్యర్థిని బరిలోకి దింపాలా, శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపాలా అనే విషయమై రెండు సంస్థలతో టిడిపి సర్వే నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వేల్లో ఈ రెండు గ్రూపులకు స్వల్ప తేడానే వచ్చిందని నిర్వాహకులు పార్టీ నాయకత్వానికి నివేదికలు ఇచ్చారు.
15 రోజులకు ఓ సర్వే నిర్వహించాలి
15 రోజులకు ఓసారి సర్వే నిర్వహించాలని టిడిపి నాయకత్వం రెండు సర్వే సంస్థలకు సూచించింది. గతంలో తీసుకొన్న శాంపిళ్ళ సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యంలో శాంపిళ్ళను తీసుకోవాలని కూడ సూచించింది. శాంపిళ్ళ సంఖ్య పెరిగితే ప్రజల అభిప్రాయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.అందుకే ఈ విషయంలో కొన్ని మార్పులు చేర్పులను సర్వే సంస్థలకు సూచించింది టిడిపినాయకత్వం.
తటస్థ ఓటర్లే కీలకం
ఇప్పటివరకు నిర్వహించిన సర్వే నివేదికల్లో శిల్పా, భూమా కుటుంబానికి మద్య వ్యత్యాసం స్వల్పంగానే ఉంది. అయితే భూమా నాగిరెడ్డి మరణించడంతో ఆ కుటుంబం నుండి అభ్యర్థిని బరిలో దింపితే టిడిపికి కొంత సానుభూతి కలిసివచ్చే అవకాశం లేకపోలేదని పార్టీవర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.భూమా నాగిరెడ్డి మరణంతో ఆయనపై స్థానికుల్లో కొంత సానుభూతి కూడ ఉందని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సానుభూతిని ఉపయోగించుకొంటే గెలుపు నల్లేరుపై నడకేనని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
భూమా హమీల అమలుకు
ఎన్నికల ముందు 15 వేల ఇళ్ళు, రోడ్ల విస్తరణ లాంటి హమీలను భూమా నాగిరెడ్డి ఇచ్చారు. అయితే ఈ పనులను చేసేందుకే ఆయన టిడిపిలో చేరినట్టు చెప్పారు. అయితే హఠాత్తుగా ఆయన మరణించారు.అయితే అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఎన్నికల ముందు తన తండ్రి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత భూమా హమీలను అమలు చేసేందుకు ఈ నియోజకవర్గంపై కేంద్రీకరిస్తున్నారు.