ప్రభుత్వానికి భారమే!: వచ్చే ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగుల పదవీవిరమణ
హైదరాబాద్/విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీ సంఖ్యలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వారికి చెల్లించాల్సిన మొత్తాలతో ప్రభుత్వంపై భారీగా భారంపడే అవకాశం ఉంది.
కాగా, నిరుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవీ విరమణలూ జరగలేదు.
అయితే, 2016 జూన్ నుంచి 2017 మార్చి 31లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 6,017 మంది పదవీ విరమణ పొందబోతున్నారు. రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు 3.5 లక్షల మంది ఉండగా.. వారిలో దాదాపు 2% మంది రిటైర్ అవుతున్నారు. వీరందరికీ గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాల్సి ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని ఆర్థికశాఖ ఇప్పటికే నిర్దేశించింది. ఏయే పద్దు కింద ఎంత మొత్తం పెంచాలో తెలుపుతూ మార్గదర్శకాలు జారీచేసింది. వచ్చే ఏడాది పదవీ విరమణ పొందబోతున్న వారిలో 3,997(66%)మంది ఎన్జీవోలు, 814(13%)మంది గెజెటెడ్అధికారులు, 1,206 (20%)మంది నాలుగోతరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వఉద్యోగులు మాత్రమే.
వీరుకాకుండా స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, వర్సిటీలు, జ్యుడిషియల్రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందర్నీ కలుపుకుంటే ఈ సంఖ్య 9వేల వరకు ఉంటుందని అంచనా. కొత్త పీఆర్సీ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికీ ప్రభుత్వం గరిష్ఠంగా రూ.12 లక్షల గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలకు పరిమితం చేసింది.
ఈ గరిష్ఠ మొత్తం గెజిటెడ్ స్థాయి అధికారులకు దక్కినా మిగతా ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులకు సగటున రూ.8 లక్షల వరకు గ్రాట్యుటీ అందజేయాల్సి వస్తుంది. అలాగే 15 ఏళ్ల పింఛనులో 40% అమ్ముకొని ఒకేసారి సొమ్ముచేసుకొనే అవకాశం ఉన్నందున దీని కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా చెల్లించాల్సి రావొచ్చని అంచనా.
రిటైర్ అయిన వారిలో దాదాపు అందరూ 40% పింఛను అమ్ముకొని ఏకమొత్తంలో సొమ్ము చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందువల్ల వచ్చే ఏడాది గ్రాట్యుటీ, కముటేషన్ కింద పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాగా, భారీ స్థాయిలో ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కొలువుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయాల్సి కూడా ఉంటుంది.