ఏపీలో రేపు రెండు అల్పపీడనాలు-తొలిసారి-రాయలసీమ, ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో రేపు రెండు అల్పపీడనాలు ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వాస్తవానికి రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రం విడిచి వెళ్లిపోబోతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగే వాతావరణ మార్పుల కారణంగా బంగాళాఖాతంతో పాటు అండమాన్ లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావం రాష్ట్రంపై పడబోతోంది. అరేబియా సముద్రంలో దక్షిణ తీరం, దక్షిణ కర్నాటక మీదుగా సముద్ర మట్టానికి కిలోమీటరున్నర నుంచి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున ఓ అల్పపీడన ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది చిత్తూరు, కడప, అనంతపురం మీదుగా ప్రయాణించబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే అండమాన్ తీరం నుంచి బంగాళాఖాతం వరకూ ఏర్పడే మరో అల్పపీడనం దక్షిణా ఒడిశా మీదుగా ఏపీపైకి విస్తరించే అవకాశముంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపై ప్రభావం పడబోతోంది. దీంతో ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇలా ఒకేసారి ఒకే సమయంలో ఓ రాష్ట్రంపై రెండు అల్పపీడనాలు ఏర్పడటం కూడా విశేషంగానే చెప్తున్నారు. అయితే అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలు లేవని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ అల్పపీడనాలు ఏర్పడకముందే పలు ప్రాంతాల్లో రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపటికి ఈ ప్రభావం మరింత ఎక్కువ కావచ్చొని అంచనా వేస్తున్నారు.