తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయి వర్షం: చెన్నై- బెజవాడ మధ్య రైళ్లు రద్దు
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో అటు తమిళనాడుతో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తిరుపతి, తిరుమలలో కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో గోగర్భ జలశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. పాపవినాశనం జలాశయం నుంచి నీటి విడుదలకు టీటీడీ చర్యలు చేపట్టింది.
మరోవైవు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయచర్యలపై సూచనలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
చెన్నై-బెజవాడ మధ్య రైళ్లు రద్దు
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రైల్వే ట్రాక్ పైకి నీళ్లు రావడంతో చెన్నై-బెజవాడ మధ్య నడిచే అన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. సోమవారం ఉదయం ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. అల్పపీడన ప్రభావం కారణంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి భారీగా నీరు
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలోనికి భారీగా నీరు చేరింది. జిల్లాలో ఎడతెరిపి తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోకి భారీగా నీరు చేరుకుంటోంది. ఈ వర్షానికి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
తమిళనాడులో 59కి చేరిన మృతుల సంఖ్య
అల్పపీడనం వాయువ్యదిశగా తమిళనాడు వైపు కదులుతున్నదని, దీని ప్రభావంతో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. సముద్రతీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గత వారం రోజులుగా తమిళనాడులో కురుస్తున్న వానల వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది. చెన్నై సహా రాష్ట్రంలోని రోడ్డన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో నాగపట్టణం వంటి కొన్ని చోట్ల 18 సెంమీ వర్షం పడినట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారి రమణన్ తెలిపారు.