AP Rains : ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు-గోదావరికి భారీవరద-కోనసీమలో రాకపోకలపై ప్రభావం..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాకపోకలతో పాటు రోజువారీ జరిగే కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి. గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. దీంతో కోనసీమలో రాకపోలకలపై ఈ ప్రభావం కనిపిస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద కారణంగా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి గట్టు తెగిపోవడంతో గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,ఉడిముడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు. అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో ఇప్పటివరకు అధికారులు వరదలపై ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి ఎదురు బిడియం కాజ్ వే ల పైకి వరద నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు భద్రాచలం నుంచి భారీగా వస్తున్న వరద కారణంగా ధవళేశ్వరంతో పాటు ఇతర వంతెనల వద్ద అప్రమత్తత కొనసాగుతోంది.
మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో పలు జిల్లాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులకు వచ్చే వరదకు వర్షాలు కూడా తోడు అయితే పరిస్ధితులు ఇబ్బందికరంగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు మాత్రమే కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications