దక్షిణాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు: రాయలసీమకూ ముప్పు
విజయవాడ: భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ తీర ప్రాంతాలను వణికిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో సాధారణ జనజీవితం స్తంభించింది. ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల 1705 చెరువులు పూర్తిగా నిండిపోయాయి.
నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 25 చెరువులకు గండి ఏర్పడింది. నెల్లూరు పెన్నా బ్యారేజ్ దగ్గర నది ఉధృతంగా ప్రవాహిస్తోంది. వెంకటగిరిలో ప్లాట్ఫారం విరిగి పట్టాలపై పడడంతో భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు నిలిపివేశారు. నెల్లూరు జిల్లాలో 25 చెరువులకు గండ్లు పడినట్లు అధికారులు చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడప జిల్లాను అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేటలోని నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. రైల్వేకోడూరులోని గుంజనేరు నది ప్రమాదం అంచున ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో రైల్వేకోడూరులో 20 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారంలో వంద ఇళ్లలోకి నీరు చేరినట్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్పై నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుత్తూరు తహశీల్దార్ కార్యాలయంలోని పలు ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడ్డాయి.
భారీవర్షాలతో చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం మండలం ఆముదాల చెరువుకు గండి పడిండి. నిండ్ర మండలంలో కొప్పేడు కాల్వ పొంగిపొర్లుతుంది. దీంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాలంగి రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేశారు. సుద్దమిట్ట గిరిజన కాలనీ, సాహనగర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కెవిబీపురం మండలంలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు మండ లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఆదివారం అర్థరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నదులు, వాగులూ వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో సాధారణ జనజీవనం స్తంభించింది.
రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. బలమైన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.