శబరిమలలో ఉద్రిక్తత: ఏపీ మహిళకు ఆందోళనకారుల బెదిరింపు, వెనక్కి తప్పలేదు
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం మార్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశించవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో బుధవారం తొలిసారి అయ్యప్ప ఆలయంలో తెరుచుకోనుంది. దీంతో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video

కాగా, మహిళలకు ఆలయ ప్రవేశం లేదని సాంప్రదాయం చెబుతుండగా అందుకు విరుద్ధంగా జరిగేందుకు తాము అనుమతివ్వమని భక్తులు, భారీ ఎత్తున మహిళలు ఆందోళనలకు దిగారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా భారీ మొత్తంలో మోహరించారు. శబరిమలకు వచ్చే మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీకి చెందిన మహిళ ఫ్యామిలీతో శబరిమలకు..
కాగా, కేరళకు చెందిన ఓ మహిళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మహిళ తమ బంధువులతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పాత్రికేయురాలు లిబి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. అలప్పుజ ప్రాంతంలో ఆమె వెళ్తున్న సమయంలో ఆందోళనకారులు లిబిపై దాడి చేశారు. ఈమెతో పాటు పంబ వద్ద ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు మాధవిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. వారిద్దరినీ బలవంతంగా వెనక్కి పంపించారు.
ఏపీ మహిళ వెనుతిరుగక తప్పలేదు
అయితే, పోలీసుల సహాయంతో మాధవి కొద్ది దూరం పాటు ప్రయాణించింది. ఆ తర్వాత ఆమెను బస్సులో పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆమెను బస్సులో ఎక్కించుకొని ఆలయం వద్దకు తీసుకెళ్తే బస్సునే తగలబెడతామని ఆందోళనకారులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె వెనుదిరగక తప్పలేదు.
పిల్లలు ఏడుస్తున్నారని మాధవి..
ఆందోళనకారులు తమను వెళ్లనీయకుండా చేయడం వల్ల పిల్లలు భయంతో ఏడుస్తున్నారని.. దీంతో కుటుంబంతో సహా వెనక్కి మళ్లక తప్పలేదని మాధవి తెలిపారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గాల వద్ద ఆందోళన చేస్తున్న దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలక్కల్ ప్రాంతంలో మహిళలను అడ్డుకునేందుకు ఆందోళనకారులు వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మీడియా వాహనాలపై ఆందోళనకారుల దాడులు
శబరిల వద్ద పరిస్థితిని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఓబీ వ్యాన్ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను మోహరించేలా కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మీడయా ప్రతినిధులు వెంటనే ఆందోళన జరిగే ప్రదేశాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళనకారులు బెదిరింపులకు దిగారు. దాదాపు 500 మంది పోలీసులు నీలక్కల్ ప్రాంతం వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం 5గంటలకు ఆలయ ద్వారాలను తెరవనున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications