అదే మన బలం! జన సైనికులారా వారిని ఆదుకోండి: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్
అమరావతి: ఉపాధి కోసం దేశం విడిచి గల్ఫ్ దేశాల్లో పనులు చేసుకొంటూ కరోనా మూలంగా అక్కడ చిక్కుకుపోయిన మనవారి బాధలు రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పట్టడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయా దేశాల్లో చిక్కుకుపోయినవారి గురించి ఎందుకు కేంద్రంతో మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
కరోనా కష్ట సమయంలో అండగా నిలవాల్సిన ప్రజా ప్రతినిదులు బాధ్యతలు విస్మరిస్తున్న తీరును ప్రజలకు తెలియచేయాలని నాయకులకు పవన్ సూచించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయినవారి బాధలను తప్పకుండా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. శనివారం కడప జిల్లా నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జిల్లాలో పండ్ల తోటల రైతులు, పసుపు పంట వేసిన రైతులు ఎదుర్కొంటున్న బాధలను, జిల్లాలో యధేచ్చగా సాగుతున్న ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా గురించి నాయకులు తెలియచేశారు.

విధ్వంసం జరుగుతున్నా.. సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు..
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "భారీగా ధ్వంసం అవుతున్న అటవీ సంపదలో ముందున్నది ఎర్ర చందనమే అని నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎర్ర చందనం వృక్షాలను నరికి అక్రమ రవాణా పెరుగుతుందని అంచనా వేశారు. ఇప్పుడు జిల్లా నాయకులు అందిస్తున్న సమాచారం తెలుసుకొంటుంటే ఆ అంచనా నిజమే అనిపించింది. ఎర్ర చందనం అక్రమ రీతిలో తరలిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమాలపై కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు.

అదే మన బలం.. జనసైనికులకు పవన్ పిలుపు
కరోనాతో ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో చాలా మంది ఉపాధికి దూరమవుతున్నారు. కరోనా అనేది ఒక దీర్ఘకాలిక సమస్య అని.. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకువచ్చారు. క్రమంగా పరిస్థితులు చక్కబడాలి. ఇలాంటి సమయంలో మనం ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. ఆ బాధ్యతను ప్రజా ప్రతినిధులు విస్మరిస్తే ఆ విషయాన్ని ప్రజలకు బలంగా తెలియచెప్పాలి. అందుకు మన మాటే మనకు మార్గం. మీడియాలోనే రావాలి అనుకోవద్దు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు... మీ పరిధిలో ఉన్న జనానికి మీ మాట ద్వారా కావచ్చు ఏం జరుగుతోందో చెప్పండి. మన మాటే మనకు బలం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఉద్యాన పంటలు వేసినవారు ఇబ్బందుల్లో ఉన్నారు. కడప జిల్లాలో అరటి, మామిడి, ఇతర పండ్లు, పసుపు, టమోటా రైతులు మార్కెట్ కు తరలించుకోలేక నష్టపోయారు. రైతు భరోసా విషయంలోనూ రైతులకు న్యాయం జరగడం లేదు అనే విషయం నా దృష్టికి చేరింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుద్దామన్నారు.

జన సైనికులారా.. వారికి సాయం చేయండి
ఆర్థికంగా బలం లేకపోయినా తోటివారు బాధల్లో ఉంటే స్పందించి ఆదుకొనే మంచి మనసు జన సైనికులకు ఉంది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి కష్టంలో ఉన్నవారికి జనసేన శ్రేణులు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఈ సేవల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ఆ జన సైనికులే పార్టీకి ఇంధనం. వారికి నా విజ్ఞప్తి... ఉపాధి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన వలస కూలీలు స్వస్థలాలకు నడుచుకొంటూ వెళ్లిపోతున్నారు. చాలా బాధలుపడుతున్నారు. అలాంటివారు మీ ప్రాంతం మీదుగా వెళ్లిపోతుంటే.. మీ శక్తి అనుకూలిస్తే భోజనం, మంచి నీళ్ళు అందించి ఆదుకోండి. వలస కూలీలకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నారు. అధికారులతో మాట్లాడి ఆ రైళ్లలో వారిని తరలించే ఏర్పాటు చేయండి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Recommended Video

ఆందోళనను తొలగించి.. ఉద్యోగులను ఆదుకోండి..
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. సుమారు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఒక నెల జీతం ఆపివేయడం, మే 13వ తేదీన ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి విడుదలైన ఒక ఉత్తర్వు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో భయాందోళనకు కారణమైంది. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగులలో జీతాలు 6000 నుంచి 15000 రూపాయల మధ్యనున్నవారే. కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కాలంలో జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారు? ఈ కష్ట కాలంలో ఉద్యోగాలు తొలగించవద్దు అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని రవాణాశాఖ మంత్రి ఈ రోజు పత్రికా ప్రకటన చేసినప్పటికీ ఉద్యోగులలో నెలకొన్న భయాందోళనలు తొలగిపోలేదు. కరోనా ఉన్నందున, వారికి ఇన్సూరెన్స్ లేదు కాబట్టే విధులకు తీసుకోలేదని మంత్రి చెప్పడం భావ్యం కాదు. కరోనా ఎప్పుడు సమసి పోతుందో తెలియదు. అప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు పిలవరా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణం జీతం బకాయి చెల్లించి, ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్












Click it and Unblock the Notifications