బీజేపీ-టీడీపీ మధ్య చీకటి బంధం.. ఆత్మకూరుతో తేటతెల్లం: మంత్రి అంబటి
నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి తిరుగులేని గెలుపును నమోదు చేశారు. 82,888 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ను ఓడించారు. ఆయనకు 19,352 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీకి ఇక్కడ డిపాజిట్లు దక్కలేదు.
ఆత్మకూరులో వైసీపీ విజయం సాధించడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019లోనూ ఇక్కడ గెలుపు.. ఆ పార్టీదే. ఈ విజయం పట్ల వైఎస్ఆర్సీపీ నేతల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతోన్నాయి. పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బాణాసంచా పేల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కొద్దిసేపటి కిందటే ట్వీట్ చేశారు. అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డికి ఫోన్ చేసి, అభినందనలు తెలియజేస్తోన్నారు. మేకపాటి సాధించిన విజయం పట్ల జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైఎస్ జగన్ సారథ్యంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఆ విజయానికి కారణం అయ్యాయని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి ఎదురు ఉండదనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీని మేకపాటి విక్రమ్ రెడ్డి అందుకున్నారని, ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. కోట్లాదిమంది ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారని, ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణలను ప్రజలు నిర్ద్వందంగా తిప్పికొట్టారని అన్నారు.
ఆత్మకూరులో విజయం సాధించడానికి తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డాయని విమర్శించారు. తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి మద్దతు తెలిపిందని ఆయన మండిపడ్డారు. బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తరహాలోనే టీడీపీ ఏజెంట్లు.. ఆత్మకూరులో కూడా బీజేపీ కోసం పని చేశారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.