మూడో రోజుకు శివాజీ దీక్ష: మోడీ, బిజెపి టార్గెట్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ హీరో శివాజీ చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం నాటికి మూడోరోజుకు చేరింది. హీరో శివాజీ చేస్తున్న దీక్షకు పలువురు ప్రజలు సంఘీభావం తెలిపారు. ఆయన దీక్షకు మద్దతు పెరుగుతోంది.
కాగా, బిజెపితో పాటు ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ప్రజలు కుళ్లుకునే విధంగా ఎపి రాజధానిని నిర్మిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఇటు వైపు కూడా చూడడం లేదని ఆయన విమర్శించారు. ఎపిని మోడీ మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను చీల్చి బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని అనుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతుందని ఆయన అన్నారు. ప్రాణాలు ఉన్నంత వరకు తాను దీక్ష సాగిస్తానని చెప్పారు.
శివాజీ దీక్షను తెలుగుదేశం పార్టీ నాయకుడు మాగంటి బాబు సమర్థించారు. శివాజీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ విజయనగరం విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సోమవారం మరో వినూత్న నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యను ఏపీ ద్రోహులుగా పేర్కొంటూ వారిద్దరి మాస్క్లను ధరించిన వ్యక్తుల చేతులకు సంకెళ్లువేసి ఎన్టీఆర్ విగ్రహంవద్ద నిరసన తెలిపారు. హోదా ప్రకటించేవరకు తమ పోరాటం ఆగదని మహాసభ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు తెలిపారు.