బీజేపీకి చిక్కు!: పోరాడాలని పవన్ కళ్యాణ్కు శివాజీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ నటుడు, భారతీయ జనతా పార్టీ నేత శివాజీ సోమవారం ఉదయం జలదీక్షకు దిగారు. బెజవాడ దుర్గ గుడి సమీపంలోని కృష్ణా నదిలో ఆయన జలదీక్ష చేపట్టారు.
కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిధులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నటుడు శివాజీ బీజేపీలో లేరని, ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ నేత సోము వీర్రాజు ఇటీవల అన్నారు. ఈ వ్యాఖ్యల పైన శివాజీ స్పందించారు.
తాను బీజేపీలో లేనని చెప్పేందుకు అసలు సోము వీర్రాజు ఎవరని ప్రశ్నించారు. ఎప్పుడో పోటీ చేస్తే వీర్రాజుకు ఏడువేల ఓట్లు వచ్చాయని, తెలుగు ప్రజలకు ఆయనెవరో కూడా తెలియదన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్, తాను ఒకేసారి బీజేపీలో చేరామని, తాను బీజేపీలో లేనంటే కామినేని కూడా లేనట్లేనని అన్నారు.
పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి...
పవన్ కళ్యాణ్ గారిని నేను ఓ మాట అడగదల్చుకున్నానని శివాజీ అన్నారు. అన్నాయ్యా మీరు బ్రహ్మాండంగా చేశారు... ప్రజలకు మీ పట్ల చాలా అభిమానం ఉంది. ఇవాళ నువ్వు రోడ్ల మీదకు వస్తే కోట్లాది మంది రోడ్డు మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మీరు రాజధాని మీద పోరాడారు... బాగుంది... మీ కుటుంబాన్ని, మెగాస్టార్ కుటుంబాన్ని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు భావి అవసరాలు కల్పించాలని, మనం మన పిల్లల కోసం ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నట్లుగానే, ఏపీ విద్యార్థులు కూడా మీ పిల్లల్లాంటి వారే కాబట్టి బాధ్యత మీదే అన్నారు.
మీలాంటి వారు సాయం చేయబట్టి తాను ఈ స్థాయిలో ఉన్నానని, అలా సాయం చేయడానికి మిగతా చాలామందికి ఎవరూ లేరని, మీరు పోరాడండని పవన్ కళ్యాణ్కు శివాజీ విజ్ఞప్తి చేశారు. మీరు పోరాడితే కచ్చితంగా అవుతుందని అన్నారు.
భోగాపురం విమానాశ్రయంపై అశోక్
దేశ ప్రయోజనాల కోసమే జిల్లాలోని భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణం చేపడుతున్నామని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరంలో అన్నారు. స్థానిక రైతులు, నిర్వాసితులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే విమానాశ్రయం నిర్మాణం చేపడతామన్నారు.