పుష్కర ఏర్పాట్లు సూపర్: ఏపీపై వెంకటేష్, తెలంగాణపై సునీల్
విజయవాడ/మహబూబ్నగర్: పుష్కర ఏర్పాట్లపై టాలీవుడ్ హీరోలు వెంకటేష్, సునీల్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపించారు. కృష్ణా పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని సినీనటుడు దగ్గుబాటి వెంకటేశ్ ప్రశంసించారు.
కృష్ణమ్మకు ఎంతో ఘన చరిత్ర ఉందని.. కృష్ణమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి రామానాయుడు చనిపోయిన తర్వాత వచ్చిన తొలి పుష్కరం కావడంతో సోదరుడు సురేశ్బాబుతో కలిసి కృష్ణానదిలో స్నానం చేసి పిండ ప్రదానం చేసేందుకు విజయవాడ వచ్చినట్లు వెంకటేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా బందర్ రోడ్డులో ఎంపీ కేశినేని నాని మిత్రులు ఏర్పాటుచేసిన ఉచిత భోజన వసతి కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నారు. యాత్రికులకు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నాని, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు రోజుకు ఏడున్నర లక్షల మందికి కృష్ణా తీరంలో ఉచితంగా భోజనాలు అందించడం గొప్ప రికార్డని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. చివరి రోజుల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది యాత్రికులు తరలిరావడం ఆనందంగా ఉందని చెప్పారు.
బీచుపల్లిలో సునీల్ పుష్కర స్నానం
మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుష్కర ఘాట్లో సినీ నటుడు సునీల్ స్నానమాచరించారు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు. సామాన్యులు ఎంత ఆహ్లదకరంగా స్నానాలు చేస్తారో వీఐపీలు సైతం అనందంగా పుణ్య స్నానాలు చేసేంత బాగా ఏర్పాట్లు ఉన్నాయని సునీల్ చెప్పారు.