ఉండవల్లిలో భూసేకరణ ప్రక్రియ నిలిపివేస్తూ...హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Recommended Video
అమరావతి:ఉండవల్లి లో భూ సేకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ లు వేసింది...ఇక్కడ భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఉండవల్లిలో భూసేకరణకు ప్రభుత్వ పరిపాలన నుంచి అనుమతులు, సీఆర్డీఏ నుంచి అభ్యర్థనలు లేకపోయినా భూసేకరణ ప్రక్రియ చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. భూసేకరణ చట్ట ప్రకారం మార్కెట్ విలువలను సవరించకుండా భూసేకరణ ప్రక్రియ చేపట్టడం సరికాదని హై కోర్టు స్పష్టం చేసింది. ఉండవల్లి భూ సేకరణ విషయమై హై కోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో చేపట్టిన భూసేకరణను సవాలుచేస్తూ ఇదే గ్రామానికి చెందిన కన్నారావు నాయుడు, పి.రంగారావుతో పాటు పలువురు వేర్వేరుగా రెండు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ చేపట్టారు. ఉండవల్లి భూ సేకరణ విషయమై పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఉండవల్లి సేకరిస్తున్న భూమి నిమిత్తం సీఆర్డీఏ నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాలేదని వాదించారు.
అయితే సీఆర్డీఏ నుంచి భూసేకరణ నిమిత్తం వచ్చిన అభ్యర్థనలు ఉన్నాయంటూ ప్రభుత్వ న్యాయవాది సమర్పించిన పత్రాలను న్యాయమూర్తి పరిశీలించారు. అవి భూ సేకరణ పత్రాలు కాదని భూ సమీకరణ పత్రాలని స్పష్టం చేశారు. భూసమీకరణ నిమిత్తం వచ్చిన అభ్యర్థనను భూసేకరణకు వర్తింపజేయరాదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
ఉండవల్లిలో భూసేకరణకు సంబంధించిన నిబంధనలను అమలు చేయనందున ఈ ప్రక్రియను నిలిపివేస్తూ హై కోర్టు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.