'టీ' సర్కారుకు షాక్: జెన్కో ఉద్యోగుల రిలీవ్పై హైకోర్టు స్టే
హైదరాబాద్: తెలంగాణ జెన్కోలో స్ధానికత ఆధారంగా చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల రిలీవ్ ప్రక్రియను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించి, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఆంధ్రా స్థానికత ఉండి తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోలో పనిచేస్తున్న సుమారు 1,100 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఎస్పీడీసీఎల్లో సూపరింటిండెంట్ ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్న పి.బి. కరుణాకర్, మరో 8 మంది ఇంజినీర్లు బుధవారం లంచ్మోషన్లో హైకోర్టును ఆశ్రయించారు.
గురువారం మరికొంత మంది ఉద్యోగులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రెడ్డి కాంతారావు విచారణ జరిపి రిలీవ్ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వాన్ని షాక్కు గురి చేసింది.
ఏపీ స్ధానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసి, ఆ ఖాళీలన్నింటినీ తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చినా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలన్న పట్టుదలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఈ రిలీవ్ ప్రక్రియను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
హైకోర్టు రిలీవ్ మార్గదర్శకాలపై హైకోర్టు స్టే ఉత్తర్వులను జారీ చేసినా అప్పటికే తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతుల ద్వారా ఆ ఖాళీలు భర్తీ అయిపోయి ఉంటాయి. ఏపీ స్ధానికత ఉన్న ఉద్యోగులు వెనక్కి వచ్చినా, వారిని ఖాళీగానే కూర్చోబెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.