హైకోర్టులో టిడిపికి ఊరట, మహానాడుకు వర్షం ఎఫెక్ట్.. ఎగిరిపోయిన టెంట్లు
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించాలనుకున్న మహానాడుకు ఉమ్మడి హైకోర్టు పచ్చజెండా ఊపింది.
అమరావతి: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించాలనుకున్న మహానాడుకు ఉమ్మడి హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఏయూలో మహానాడు నిర్వహించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. వర్సిటీలో రాజకీయ సభలు వద్దని అందులో పేర్కొన్నారు.
రీసెర్చ్ స్కాలర్ ఒకరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏయూలో మహానాడుకు పచ్చజెండా ఊపింది.
మహానాడుపై వర్షం ఎఫెక్ట్
విశాఖలో నిర్వహించనున్న మహానాడుపై వర్షం ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తున్నాయి. వీటి ప్రభావానికి మహానాడులో టెంట్లు లేచిపోయాయి.
గతంలో వైసిపికి నో..
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మహానాడు నిర్వహించాలని టిడిపి నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ సభ నిర్వహిస్తామంటే రాజకీయాలు వద్దని నిరాకరించారని, ఇప్పుడు మహానాడును ఎలా నిర్వహిస్తారని వైసిపి ప్రశ్నించింది.
టిడిపి వివరణ
అయితే, యూనివర్సిటీకి ఇప్పుడు సెలవులు ఉన్నాయని, అందుకే తాము పార్టీ సభ నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇలాంటి సమయంలో ఓ స్కాలర్ హైకోర్టులో మహానాడు నిర్వహణపై పిల్ దాఖలు చేశారు. హైకోర్టు మాత్రం పిల్ కొట్టివేసింది.
మహానాడుకు సిద్ధం
మరోవైపు, టిడిపి మహానాడు పండుగకు ఏయూలో సర్వం సిద్ధమయింది. ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మహానాడు జరగనుంది. జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తల రాకతో నగరం పసుపుమయం అయింది. వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రాంగణంలో ఫ్యాన్లు ఏర్పాట్లు చేశారు. మహానాడుకు వచ్చే అతిథులకు కృష్ణా, గోదావరి వంటకాలు రుచి చూపించనున్నారు.
ఈ రోజు ఎమ్మెల్సీ మూర్తి ఇలా..
కాగా, ఏయూను దెయ్యాల కొంపగా అభివర్ణించి విమర్శల పాలైన ఎమ్మెల్సీ మూర్తి శుక్రవారం మాట్లాడుతూ... ఏయూలో మైదానంలో టిడిపి మహానాడు జరగడం గర్వకారణం అన్నారు. ఏయూ ప్రతిష్ట పెంచేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తానన్నారు. కొంతమంది కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. కాగా, ఏయూను ఆయన దెయ్యాల కొంపగా అభివర్ణించడంపై మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.