టీడీపీకి షాక్: 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలుపొంది అనంతరం పార్టీ ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలకు మంగళవారం ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యం
ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అవహేళన చేస్తూ టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఆ మంత్రులకు అర్హత లేదు
కాగా, పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఎన్ అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియలకు రాజ్యాంగం ప్రకారం ఆ పదవుల్లో కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదని, అందువల్ల వారి మంత్రి పదవులను రద్దు చేయాలని కోరుతూ అన్నా వెంకట రాంబాబు తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
పదవుల్లో కొనసాగకుండా..
ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కారని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున పెనాల్టీ విధించాలని అన్నా వెంకట రాంబాబు తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యం తేలేవరకూ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు.