పూర్తి వివరాలు ఇవ్వండి: ఆభరణాల అదృశ్యం, తవ్వకాలపై టీటీడీకి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నెలకొన్న వివాదంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నగల మాయం, ఆదాయ వ్యయాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న అభియోగాలపై సీబీఐతో విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ మేరకు టీటీడీ జేఈఓ తోపాటు రాష్ట్ర దేవాదాయ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
గుజరాత్కు చెందిన భూపేందర్ గోస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే ఇద్దరు భక్తులు గతంలో పిల్ దాఖలు చేశారు. వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వంతోపాటు టీటీడీని ఆదేశించింది.
కాగా, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా తీసుకోవాలని పిటిషనర్లు కోరగా.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. మీడియా కథనాలను ఆధారంగా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.