10కోట్లను డిపాజిటర్లకు చెల్లించండి: అగ్రి, అక్షయ్గోల్డ్ కేసుల్లో హైకోర్టు
హైదరాబాద్: అక్షయ గోల్డ్ నుంచి స్వాధీనం చేసుకున్న 10కోట్ల రూపాయల సొమ్మును డిపాజిటర్లకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిపాజిటర్లకు వారి సొమ్ము చెల్లించేందుకు రూ. 135 కోట్లు అవసరమన్నారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం అక్షయ గోల్డ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 300 కోట్లని గతంలో సిఐడి కోర్టుకు తెలిపిందని పేర్కొన్నారు.
అక్షయ గోల్డ్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆస్తుల విలువ పెరగడంతో ఒంగోలు వద్ద ఉన్న రూ.50 కోట్ల ఆస్తులను కొంత మంది ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని పేర్కొన్నారు. సిఐడి స్వాధీనం చేసుకున్న ఆస్తులను పరిరక్షించాలని హైకోర్టు సిఐడి పోలీసులను ఆదేశించింది. అనంతరం ఈకేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేసి వేలం వేయండి
ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్కు చెందిన జప్తు(సీజ్) చేసి వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న ఆస్తుల జాబితాను అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. వివిధ జిల్లాల్లో వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న ఆస్తులను గుర్తించి జాబితా సమర్పించాలంది.
అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్లు వసూలు చేసి ఎగవేయడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం లేకపోతే ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ గత వారం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో చట్టప్రకారం ఉన్న అధికారాన్ని గురువారం ధర్మాసనానికి వివరించింది. జప్తు చేసిన ఆస్తులను వేలం వేయడానికి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ప్రభుత్వానికి అధికారం ఉందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్ చెప్పారు. వేలం వేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉన్నపుడు వేలానికి సిద్ధంగా ఉన్న ఆస్తులను గుర్తించి ఇవ్వాలంటూ విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.