అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పోలీసులకు ప్రశ్న
హైదరాబాద్/విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు.. రెండ్రోజుల్లోగా సంస్థకు ఉన్న ఆస్తులు, కంపెనీ వివరాలను వెల్లడించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
అదే విధంగా అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల వివరాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు, కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మమని ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఇదే సమయంలో ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. 154 ఆస్తుల వివరాలు తెలపాలని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను గురువారాని(సెప్టెంబర్ 3)కి వాయిదా వేసింది.
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీల విధివిధానాలపై జీవో నెం.63ను సోమవారం విడుదల చేసింది. బదిలీల ప్రక్రియకు ఆన్లైన్ అవకాశం కల్పించింది.
గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీలకు జిల్లా స్థాయి, జోన్ల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.