స్పీకర్ తేల్చకుండా మేమెలా?: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చేసిన హైకోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అంశంపై హైకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను, ఫిరాయింపులను ప్రోత్సహిస్తునందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్య 'విచారణార్హత'పై హైకోర్టు ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
Recommended Video
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వ్యవహారం స్పీకర్ ముందు పరిష్కారం కాకుండా తామెలా విచారించగలమని పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి వాదనలు వినేందుకు విచారణను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సతీష్కుమార్ హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.