సుమన్ రాథోడ్ ఎస్టీ కారు: షాక్ ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సుమన్ రాథోడ్ ఎస్టీ కాదన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కలెక్టర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో సుమన్ రాథోడ్కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు పలు మలుపులు తిరిగింది.
హరినాయక్ అనే నేత ఖానాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా 2009 ఎన్నికలలో సుమన్ రాథోడ్పైన పోటీ చేసి ఓడిపోయారు. సుమన్ టిడిపి తరఫున గెలిచారు. ఆమె ఎస్టీ కాదని హరినాయక్ కోర్టుకెక్కారు. ఈ వ్యవహారం మొదట జిల్లా కలెక్టర్ పరిధిలోకి రాగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కుల ధృవీకరణపై వేసిన కమిటీ సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని చెప్పింది. దీంతో హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది.
దీనిని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన 2003 సవరణను కొట్టివేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తీర్పుపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం స్టే ఎత్తివేయాలని కోరుతూ హరినాయక్ మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. దీనిని కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అయితే, చివరగా సుమన్ రాథోడ్కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువడింది.
సుమన్ రాథోడ్ గిరిజనుల కోటాలో ఎన్నికయ్యారు. ఆ ఎన్నికను సవాలుచేస్తూ కోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో కోర్టు ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేసిన ప్రభుత్వం ఆమె మహారాష్ట్ర లంబాడాలకు చెందినవారని అక్కడ ఆ కులం బీసీల కిందకు వస్తుందని తెలిపారు. దీంతో కోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసింది. అప్పీలుకు 6 వారాల సమయం ఇచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.