హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్పై నేడే తుది తీర్పు...
ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగినప్పటికీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓట్లను లెక్కించలేదు. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు వస్తే తప్ప ఈ ప్రక్రియ ముందుకు కదలదు. ఈ అంశంపై మే 4న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం(మే 21) ఉదయం 10.30గంటలకు ఆ తీర్పును వెల్లడించనున్నారు.
గతేడాది నిర్వహించాల్సిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో... మళ్లీ అక్కడినుంచే ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల విషయంలో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని హైకోర్టులో పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచే ఎన్నికల కోడ్ విధించాలన్న నిబంధనలు పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
వర్ల రామయ్య పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశిస్తూ ఏప్రిల్ 6న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్... ఎన్నికల ప్రక్రియకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
కాగా, ఏపీలోని 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీ స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 జడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పలు చోట్ల వివిధ కారణాలతో పోలింగ్ జరపలేదు.
Recommended Video