అర్ధరాత్రి వరకు ఢిల్లీలో హైడ్రామా: రేపు ఢిల్లీకి రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు
అమరావతి: ప్రత్యేక హోదాకు ధీటుగా కేంద్రం ఏపీకు ఇవ్వాలనుకుంటున్న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. ఆ దిశగా కేంద్రం కసరత్తు చేస్తోందని, కేంద్ర ఆర్ధిక మంత్రి బుధవారం మధ్యాహ్నం ప్యాకేజీ ప్రకటన వెల్లడిస్తారనే సమాచారంతో ఉదయం నుంచి నార్త్ బ్లాక్లోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయంలో హడావిడి నెలకొంది.
ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది. ఏపీకో హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడుతున్న క్రమంలో జైట్లీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ప్యాకేజీ ప్రకటన ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేయబోయే కీలక నిర్ణయం కావడంతో తెలుగు వార్తాసంస్థలతో పాటు జాతీయ మీడియా ప్రతినిధులు సైతం అరుణ్ జైట్లీ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే చివరకు తుది ప్యాకేజీ ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనల మేరకు ప్యాకేజీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్యాకేజీపై తుది కాపీ సిద్ధమైందని వార్తలు వస్తున్నప్పటికీ, ప్రస్తుతం లావోస్ పర్యటలో ఉన్న ప్రధాని మోడీ తిరిగి వచ్చిన తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్రం చెప్పింది.
ఏపీకి ప్రత్యేకప్యాకేజీ నివేదికను పీఎంఓ అధికారులు విదేశాల్లో ఉన్న మోడీకి కూడా పంపారు. మోడీ ఆమోదం తర్వాత అధికారికంగా కేంద్రం ప్రకటించనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఏపీకి ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటన చేయాల్సి ఉన్నా రాత్రి 8 గంటలకు వాయిదా పడింది.
అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏపీకి సాయం విషయమై నార్త్ బ్లాక్ లో అరుణ్ జైట్లీతో మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్యాకేజీ గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమాలోచనలు జరిపారు.
చివరకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. దీంతో ప్యాకేజీ కాపీని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా కేంద్రం పంపింది. ఈ నేపథ్యంలో జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ప్రధాని మోడీ ఆమోదం తర్వాతే ప్రకటన ఉండటంతో జైట్లీ మీడియా సమావేశం మళ్లీ వాయిదా పడింది.
ఇలా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయమై బుధవారం రాత్రి వరకూ ఢిల్లీలో హైడ్రామా నడిచింది. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా కొందరు ఎంపీలతో కలిసి ఉదయం నుంచి ఆ కార్యాలయం చుట్టూతిరుగూ కనిపించారు. ఇక విజయవాడలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీలు నిర్వహించారు.
హస్తినలో ప్యాకేజీపై జరుగుతున్న తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు విజయవాడ నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. రాత్రి 11 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో జైట్లీ, పీఎంఓ అధికారులు ప్రతి నిమిషం టచ్లో ఉన్నారు. చంద్రబాబు డిమాండ్లను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తోందని వార్తలు కూడా వచ్చాయి.
మరోవైపు ఏపీ బీజేపీ నేతలంతా ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కీలకనేతలైన హరిబాబు, విష్ణు కుమార్ రాజు, పురంధేశ్వరిలు ప్రస్తుతం విశాఖలోనే ఉన్నారు. వీరితోపాటు మరికొందరు ముఖ్యనేతలు గురువారం ఉదయం ఢిల్లీ వెళతారని సమాచారం.