వంగవీటి రాధా అరెస్ట్: బెజవాడలో ఉద్రిక్తత, స్టేషన్ బయట బైఠాయించారు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధానిగా కొనసాగుతున్న విజయవాడలో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సింగ్ నగర్కు చెందిన పేదళ ఇళ్ల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.
కాగా, పార్టీ నగర కన్వీనర్ హోదాలో ఈ ఆందోళనకు వంగవీటి రాధా నేతృత్వం వహించారు. అయితే ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ని ఆందోళన విరమించాలని కోరారు. అయితే పోలీసుల వినతికి ససేమిరా అనడంతో వంగవీటి రాధాను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించినా వంగవీటి రాధాను పోలీసులు జీపులోకి ఎక్కించి సమీపంలోని పాయకాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో రాధా అరెస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
మరోవైపు రాధాని అరెస్ట్ చేశారని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, వర్గీయులు వేలాదిగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భూమన, చెవిరెడ్డిలపై కేసు కొట్టవేత
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు నెల్లూరులోని రైల్వే కోర్టులో ఊరట లభించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లోకి 500 మంది కార్యకర్తలతో ప్రవేశించిన భూమన, చెవిరెడ్డి రైల్ రోకోకు దిగిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను చేపట్టిన రైల్వే కోర్టు ముందు పోలీసులు సరైన సాక్ష్యాలను చూపలేకపోవడంతో కేసు కొట్టివేశారు.
ఈ కేసులో నిందితులపై నేరం రుజువు కాలేదని, ఈ కారణంగానే కేసును కొట్టివేస్తున్నామని న్యాయమూర్తి అరుణశ్రీ మంగళవారం తీర్పు వెలువరించారు.