తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత...రోడ్డుపై బైఠాయించిన ఎంపీ జేసీ
అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడి ప్రబోధానంద స్వామి వర్గీయులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి చిన్నపొడమల గ్రామస్తులకు మద్దతుగా ఈ రోజు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
వినాయక నిమజ్జనం ట్రాక్టర్లు తమ ఆశ్రమం మీదుగా పోకూడదని ప్రబోధానంద స్వామి అనుచరులు, అటునుంచే తీసుకు వెళతామని గ్రామస్తులు పట్టుపట్టడమే వివాదానికి కారణం. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిన్నపొడమల గ్రామానికి చేరుకున్న అనంతపురం ఎంపి జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులకు న్యాయం జరిగేవరకూ తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. అసలు ఆ ఆశ్రమంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయని ఎంపి జెసి ఆరోపించారు.

గ్రామస్థులతో అనవసరంగా వివాదానికి దిగిన ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేయాల్సిందేనని జేసీ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ జీవీ అశోక్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో జేసీ వెంట భారీగా టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. దీంతో మరోవైపు పరిస్థితులను బట్టి మరింత పోలీసులను మోహరిస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం చిన్నపొడమల గ్రామస్తులు గణేష్ నిమజ్జనానికి వెళ్లే దారి విషయమై ఆ గ్రామస్థులతో వివాదం నేపథ్యంలో
ప్రబోధానంద స్వామి ఆశ్రమ భక్తులు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాన్ని అడ్డుకోవడంతో పాటు గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమం వద్ద భీతవహ వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలో వారు పోలీసులపై సైతం వారు దాడికి తెగబడటం గమనార్హం. ఈ దాడుల్లో ఒక సిఐతో పాటు, 20 మంది గ్రామస్తులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications