బస్సులో బంగారం బ్యాగ్ మారింది...పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు...
హిందూపురం: బస్సు ప్రయాణంలో బంగారం పోగొట్టుకొని పోలీసులు వెంటనే స్పందించడంతో మళ్లీ తన బంగారాన్ని దక్కించుకొన్నఅదృష్టవంతురాలైన గృహిణి ఉదంతమిది.అనంతపురం జిల్లా మడకశిర మండలం యల్లోటి గ్రామానికి చెందిన ఎన్.నేత్ర అనే మహిళ తన భర్త సదానంద, కూతురుతో కలిసి బెంగుళూరులో నివసిస్తోంది. అయితే స్వగ్రామానికి వెళ్లేందుకు గాను మంగళవారం బెంగళూరు నుంచీ ఎస్.ఎన్ ట్రావెల్స్ బస్సులో హిందూపురం బయలుదేరింది. అయితే హిందూపురంలో ఉదయం 8.30 గంటలకు దిగేటప్పుడు ఆమె బ్యాగ్ తారుమారు అయింది.
వేరే బ్యాగ్...
బస్సు దిగాక ఆమె చేతిలో వేరే బ్యాగ్ ఉండటం చూసి నివ్వెరపోయింది. వెంటనే లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తింది. హిందూపూర్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం బస్సులోని తన బ్యాగ్ లో దుస్తులతో పాటు బంగారం ఉందని పూర్తి వివరాలతో కంప్లయింట్ ఇచ్చింది.
బ్యాగ్ లో బంగారం...
ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం బ్యాగులో 36 గ్రాముల బంగారు నెక్లెస్ , 24 గ్రాముల పుస్తెలతాడు, కమ్మలు, మాటిలు కలిపి మరో 36 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నట్లు పేర్కొంది. బ్యాగులోని బంగారం మొత్తం సుమారు 100 గ్రాములు ఉంటుందని, వాటి విలువ సుమారు 3 లక్షల రూపాయల పైనేనని తెలిపి బోరుమంది.
పోలీసుల స్పందన...
మహిళ ఫిర్యాదుతో అప్రమప్తమైన హెడ్ కానిస్టేబుల్ శశి కుమార్ వెంటనే స్పందించి పెనుకొండ ఎస్ఐ కు సమాచారం అందించారు. పెనుకొండ ఎస్ ఐ సూచనలతో హోంగార్డు నాగరాజు ఆ బస్సు వివరాలు తెలుసుకొని బస్సును పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బస్సు వెళ్లిన సమయం వివరాలు తెలుసుకొని ఆ దారిలో వెంబడించారు. అల్లంతదూరాన బస్సును గుర్తించిన పోలీసులు దాన్ని ఛేజ్ చేసి ఎట్టకేలకు కియా మోటార్స్ సమీపంలోని జాతీయ రహదారి 44 పై బస్సును ఆపారు.
బ్యాగ్ దొరికింది...
ఆ తరువాత ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం మార్పిడి జరిగిన బ్యాగును గుర్తించి ప్రయాణీకుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును పోగొట్టుకున్న నేత్ర తన ఫిర్యాదులో పేర్కొన్నప్రకారం బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు సరిగా ఉన్నట్లు గుర్తించి ఆ బ్యాగును బాధితురాలికి సి.ఐ గోవింద్ సమక్షంలో అప్పగించారు.
పోలీసులకు కృతజ్ఞతలు...
పోలీసులు తక్షణమే స్పందించడం వల్లే తన బంగారం తనకు దక్కిందని మహిళ సంతోషం వ్యక్తం చేసింది. తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకోకుండా పోలీసులు చేసి సహాయం జీవితంలో మర్చిపోలేనని,పోలీసులకు ఎంతగానో రుణపడి ఉంటానని మహిళ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
ఎస్పీ అభినందన..
మహిళ బ్యాగు పోగొట్టుకోవడంపై ఎస్ఐ రహిమాన్, ఎఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ శశి కుమార్ వెంటనే స్పందించడం వల్లనే బాధితురాలికి సత్వర న్యాయం జరిగిందని అందరూ అభినందించారు. బాధితురాలు పోగొట్టుకున్న 80 గ్రాములు బంగారు ఆభరణాలు బ్యాగును అందజేసిన పోలీసులను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ అభినందించారు. వారికి రివార్డులు ప్రకటించారు