రంగంలోకి కేంద్రం: అశోక్ సీఎం తప్పుడు ప్రచారం, 23 జిల్లాల సీఎం బాబు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ 8 సహా ఎన్ని సమస్యలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయెల్ పరిష్కరించనున్నారు. ఇందుకోసం గోయల్ టీం హైదరాబాదు వస్తోంది. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా అడిగింది.
దీనికి ఆయన స్పందించేందుకు నిరాకరించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ పైన చెప్పడానికేమీ లేదన్నారు. వివాదాలను పరిష్కరిస్తున్నామని, హోంశాఖ కార్యదర్శిని ఆదేశించామని చెప్పారు.

అశోక్ గజపతి రాజు అని తప్పుడు ప్రచారం, 23 జిల్లాల సీఎం చంద్రబాబే
విభజన చట్టంలోని సెక్షన్ 8 చెల్లకుంటే విభజన చట్టం కూడా చెల్లదని, 23 జిల్లాలకు చంద్రబాబే ముఖ్యమంత్రి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సెక్షన్ 8పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెక్షన్ 8 చెల్లదని కేసీఆర్ పేర్కొంటున్నారని, అది చెల్లకుంటే విభజన చట్టం కూడా చెల్లదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పిన విషయం తెలిసిందే. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంతోపాటు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సెక్షన్ 8ని గవర్నర్ అమలు చేయాల్సిందేనన్నారు.
రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ వాళ్లకు దండం పెడుతూ కూర్చున్నారంటే, తెలుగు ప్రాంత ప్రజలను అవమానించడమేనని, కేసీఆర్ భస్మాసురుడిలా వ్యవహరిస్తూ తన అంతానికి తానే సిద్ధమవుతున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు.
సెక్షన్ 8 రాజ్యాంగ విరుద్ధమనడం కేసీఆర్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్కు అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, సెక్షన్ 8 చెల్లకుంటే విభజన చట్టమూ చెల్లదని 23 జిల్లాలకు చంద్రబాబే సీఎం అన్నారు. చంద్రబాబుపై చర్యలకు ఉపక్రమిస్తూ కేసీఆర్ అంతం ప్రారంభమైనట్లేనన్నారు.
ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజల హక్కులు కాలరాసేలా టి-సర్కార్ వ్యవహరిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యవహారంతోపాటు, ఏపీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
గవర్నర్ నరసింహన్ ఓ రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు. మరోవైపు, అశోక్ గజపతి రాజు కాబోయే సీఎం అని తప్పుడు ప్రచారం జరుగుతోందని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి భయపడేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications