12, 13న వేర్వేరుగా ఆల్ పార్టీ: కిరణ్, బొత్సలు వేరుగా..
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది! ఈ నెల రెండో వారంలో రాజకీయ పార్టీలతో వేర్వేరుగా భేటీ కావాలని మంత్రుల బృందం(జివోఎం) నిర్ణయించినట్లు తెలుస్తోంది. విభజనపై అభిప్రాయాలను మంత్రుల బృందంకు ఐదో తేదిలోగా చెప్పాలని ఎనిమిది రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభిప్రాయం చెప్పాక రెండో వారంలో చర్చించాలని భావించింది. రెండు రోజుల పాటు రోజుకు నాలుగు పార్టీల చొప్పున ఎనిమిది పార్టీలతో భేటీ కావాలని జివోఎం నిర్ణయించింది. ఈ నెల 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు రోజుకు నాలుగు పార్టీల చొప్పున వేర్వేరుగా భేటీ కానున్నారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మినిస్టర్స్ క్వార్టర్సులో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు భేటీ అయ్యారు. జివోఎంకు ఇవ్వాల్సిన నివేదిక, అఖిల పక్షంపై చర్చిస్తున్నారు.
కిరణ్, బొత్సలు వేర్వేరు నివేదిక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు జివోఎంకు వేర్వేరుగా నివేదికలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సమైక్యవాదం వినిపిస్తుండగా, బొత్స సమైక్యమని చెబుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. అయితే సిడబ్ల్యూసి ఇప్పటికే విభజనపై తీర్మానం చేసిన నేపథ్యంలో పార్టీ తరఫున నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పడం గమనార్హం.