అప్పుడు మెచ్చుకున్న పోలీసులు కూడా వీరే.. చంద్రబాబుపై హోంమంత్రి సుచరిత ఫైర్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశంసించిన పోలీసులు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. విశాఖలో ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు సాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై హోంశాఖ మంత్రి సుచరిత స్పందించారు. గురువారం పోలీసులపై విరుచుకుపడ్డ చంద్రబాబు.. ఇదివరకు మెచ్చుకున్నారని గుర్తుచేశారు.
చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఉందని సుచరిత అంగీకరించారు. కానీ విశాఖపట్టణంలో అడుగు ముందుకేసే పరిస్థితి లేదని.. అందుకే వెళ్లొద్దని చంద్రబాబుకు సూచించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ప్రజలే అడ్డుకున్నారని హోంమంత్రి తేల్చిచెప్పారు.
మూడు రాజధానులపై తన స్టాండ్ చెప్పిన టీడీపీ.. ఉత్తరాంధ్రలో పర్యటించేందుకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దని మీరే అంటారు..? ప్రజా చైతన్య యాత్ర చేపడుతారా అని నిలదీశారు. రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు రాగా.. ప్రజలే అడ్డుకున్నారని పేర్కొన్నారు.
అయితే చంద్రబాబు నాయుడును ఎవరూ అరెస్ట్ చేయలేదని తేల్చిచెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వెనక్కి పంపించామని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి నిన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నామని తెల్లని కాగితంపై పోలీసు అధికారి సంతకంతో మీడియాకు చూపించారు. అదీ నిజం కాదని.. అరెస్ట్ చేయలేదని వెనక్కి మాత్రమే పంపించామని హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు.