ఉద్యోగులదే ఆలస్యం!: అమరావతిలో హాస్టళ్లు సిద్ధం, హైదరాబాద్లో కరపత్రాలు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పరిపాలన సాగించాలని యోచిస్తున్న ఏపీ ప్రభుత్వం జూన్ 27 నాటికి హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు పూర్తి చేయాలని బుధవారం సర్క్యులర్ జారీచేసింది. దీంతో పాటు జూన్ 27 నాటికి ఉద్యోగులందరూ అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి తరలిరావాలని అందులో పేర్కొంది.
ప్రభుత్వం ఈ సర్క్కులర్ జారీ చేసిన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ఉద్యోగులు అవసరమైన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రైవేట్ నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. ఇక ఉద్యోగులు తరలిరావడమే ఆలస్యం. కుటుంబాలతో తరలివచ్చే ఉద్యోగుల కోసం అపార్టుమెంట్లు, వ్యక్తిగత గృహాలను ఇప్పటికే కొంతమంది బిల్డర్లు, స్థానిక వ్యాపారులు సిద్ధం చేశారు.
తాజాగా సమాచారం మేరకు ఉద్యోగులు తాత్కాలికంగా నివసించేందుకు హాస్టళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. కొత్త రాజధానికి తరలివచ్చే సచివాలయ ఉద్యోగులకు ఏడాది పాటు ఐదు రోజుల పని దినాలుగా కుదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వారంలో రెండు రోజులు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ఉద్యోగులు అక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఐదు రోజులు తాత్కాలిక రాజధాని ప్రాంతంలో తాత్కాలిక నివాసాల్లో ఉండి.. మిగిలిన రెండు రోజులు హైదరాబాద్లో కుటుంబాలతో గడిపేవారే ఎక్కువగా ఉంటారు.
ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ హాస్టళ్లలో ఏసీ, నాన్ ఏసీ సదుపాయంతో.. నలుగురైదుగురు, ఇద్దరు ముగ్గురు షేరింగ్ చేసుకుని నివాసం ఉండేందుకు గదులను సిద్ధం చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా హాస్టళ్లను నిర్మించారు.
భోజనంతో కలిపి వసతి కావాలనుకునేవారికి.. కేవలం వసతి మాత్రమే కోరుకునేవారికి ఆకర్షణీయమైన ధరలతో హాస్టళ్లను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న మందడం గ్రామంలో ఈ తరహా హాస్టళ్లను నిర్మించారు.
మందడంలో ఇటీవల ఈ తరహా హాస్టళ్లను నిర్మించిన నిర్వాహకులు తమ హాస్టల్లో దిగితే కల్పించే సౌకర్యాల గురించి ప్రచారం చేస్తూ ఓ కరపత్రాన్ని ముద్రించారు. హైదరాబాద్లోని ఏపీ సచివాలయంలో ప్రతీ బ్లాక్కు వెళ్లి ఆయా కరపత్రాలను ఉద్యోగులకు పంపిణీ చేశారు.
మందడం వచ్చి స్వయంగా తమ హాస్టళ్లను చూసుకోవచ్చని కూడా చెప్పారు. ఇదే విధంగా మరికొన్ని హాస్టళ్లను నిర్మించే పనిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి రాకపోకలు సాగించాలనుకుంటున్న ఉద్యోగులకు ఈ హాస్టళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు కాబట్టి ఉద్యోగులు కూడా ఈ హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.












Click it and Unblock the Notifications