దూరంగానే: కొత్తపల్లి గీత వ్యాఖ్యల కలకలం, అందుకే అలా మాట్లాడారా?
విశాఖపట్నం: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, ఆమె నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయని అంటున్నారు. ఆమె 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి టీడీపీలోకి ఫిరాయించారు.
గత మూడున్నరేళ్లుగా ఆమె టీడీపీతో కలిసి నడుస్తున్నారు. అయితే తాజాగా ఆమె స్వరం మార్చారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అరకులో నిర్వహించిన బెలూన్ ఫెస్ట్కు తనకు ఆహ్వానం అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్రిటెక్ సదస్సుకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది.

అందుకే ఏ పార్టీలో లేనని
దీనిపై కొత్తపల్లి గీత అలక వహించారని ప్రచారం సాగింది. దీనిని అధికార పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెలో అసంతృప్తి కనిపిస్తోందని అంటున్నారు. అందుకే ఇటీవల ఆమె తాను ఏ పార్టీలో లేనని చెప్పారని అంటున్నారు. తాను ఏ పార్టీలో లేనని ఆమె చెప్పడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

అలా చూస్తున్నారు
గత ఆదివారం విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన వనసమారాధనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ఏ పార్టీలో లేనని ప్రకటించారు. టీడీపీతో సంబంధం లేదని చెప్పారు. తాను టీడీపీలో చేరిన నేతగా అందరూ చూస్తున్నారని, అయితే తాను ఎప్పుడూ ఆ పార్టీలో చేరలేదన్నారు.

వైసీపీకి దూరంగానే ఉన్నా
భవిష్యత్తులోను టీడీపీలో చేరనని కూడా కొత్తపల్లి గీత చెప్పారని తెలుస్తోంది. తాను వైసీపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. తాను టీడీపీలో లేనన్న విషయాన్ని అందరూ గుర్తించాలని ప్రజలు, మీడియాకు సూచించారు. అయితే సమయం, సందర్భం లేకపోయినప్పటికీ ఆమె తాను టీడీపీలో చేరలేదని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు
కాగా, త్వరలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యూహాత్మకంగా జనసేన వైపు చూసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. వైసీపీకి దూరం, టీడీపీలో ఉండటం లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పట్ల ఆసక్తితోనే అమె అలా అని ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications