దేవుళ్ళతో గేమ్స్ ఆడేస్తున్న ఏపీ వైసీపీ , టీడీపీ నేతలు .. సత్యప్రమాణాల సవాళ్ళతో దేవుళ్ళకు తప్పని తిప్పలు
ఏపీ రాజకీయాల్లో దేవుళ్లకు తిప్పలు తప్పడం లేదు. అధికార ,ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలు దాకా వెళ్ళటం ఏపీ రాజకీయాల్లో , ఏపీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది . అంతేకాదు పోటీపడి మరీ రాజకీయ పార్టీల నేతలు దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలకు దిగడంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం దేవుళ్ళకు కూడా తిప్పలు తెచ్చిపెట్టింది. ఇదెక్కడి ఖర్మరా దేవుడా అంటూ ప్రజలు రాజకీయ నేతల తీరుతో విస్తుపోతున్నారు.

అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు మొదలుపెట్టిన సత్యప్రమాణాలు
మొన్నటికి మొన్న అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకుంటూ చివరకు సత్య ప్రమాణాల దాకా వెళ్లారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో తన భార్యతో పాటు సత్య ప్రమాణం చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు. పోటీపడి మరీ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన సతీమణితో కలిసి వెళ్లి బిక్కవోలు గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు.

అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు గణపతి ముందు సత్యప్రమాణాలు ,ఇప్పుడు విశాఖలో కూడా
ఒకరిపై ఒకరు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసుకుంటూ, దేవుళ్ళ ముందు ప్రమాణాలు చేయడంతో అనపర్తి నియోజకవర్గం లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి పోలీసులు పహారా కాయవలసి వచ్చింది . ఇదిలా ఉంటే తాజాగా టిడిపి ఎమ్మెల్యే, వైసీపీ నేతల మధ్య మరోమారు చోటుచేసుకున్న సవాళ్ళు సత్య ప్రమాణాల దాకా వెళ్లాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

విశాఖలో వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ తో సత్యప్రమాణానికి రెడీ అయిన వైసీపీ నేత
దీనికి కౌంటర్ గా వెలగపూడి రామకృష్ణబాబు తనపై చేసిన ఆరోపణలపై గుడిలో సత్య ప్రమాణం చేయాలని విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు. అయితే విజయసాయిరెడ్డి తరఫున ఆ పార్టీ తూర్పు ఇన్చార్జి విజయనిర్మల సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఇంటిముందు భారీగా మోహరించారు. అంతేకాదు సత్య ప్రమాణం చేయాలని వెలగపూడి సవాల్ చేసిన ఈస్ట్ పాయింట్ కాలనీ లోని సాయిబాబా గుడి దగ్గర కూడా మూడంచెల పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

విస్తుబోతున్న జనాలు .. భగవంతుడితో ఆటలా అని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చూసుకునే విమర్శలకు, ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలకు మధ్యలో దేవుడ్ని లాగడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. ఏది పడితే అది ఆరోపణలు చేసి తీరా దేవుళ్ళ ముందుకు వెళ్లి సత్య ప్రమాణాలు చేసే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బరితెగించి తిట్టుకుంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ తీరు మార్చుకోవాలని, ఏ రాజకీయ పార్టీ నేత లైన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆలయాలలో సత్య ప్రమాణాలకు దిగటం, భగవంతుడితో ఆటలాడటమేనని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications