ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల: చిన్నారిని చంపిన కసాయి తండ్రి
ఏలూరు/ నెల్లూరు: ఊరెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటిని దోచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం గ్రామపంచాయతీలోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్న శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం వేరే ఊరికి వెళ్లారు.
ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలోని 25 కాసుల బంగారం, రెండు కేజీ వెండి, కొంత నగదు చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. దాంతో వారు పోలీసులకు విషయం తెలిపారు. రూరల్ ఎస్సై కిషోర్బాబు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు.
ఇదిలావుంటే, నెల్లూరు పట్టణంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల అనే కారణంతో ఓ కసాయి తండ్రి ఐదు నెలల చిన్నారిని గొంతు నులిమి హత్య చేశాడు. నెల్లూరు పట్టణంలోని గుర్రాలమడుగు సెంటర్ కు చెందిన అన్సర్ అనే వ్యక్తి ప్రత్యూష అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు.
వీరికి హర్షియా(5 నెలలు) అనే పాప ఉంది. హర్షియా పుట్టిన నాటి నుంచే తనకు ఆడపిల్ల పుట్టిందని అసహ్యించుకుంటున్న అన్సర్ మంగళవారం పాపను గొంతు నులిమి హత్య చేశాడు. అన్సర్కు నేర చరిత్ర కూడా ఉందని తెలుస్తోంది.
గతంలో భార్య ప్రత్యూష కొత్త చీర కట్టుకున్నదని ఆమె జుట్టు కత్తిరించాడని, అంతేగాక కిరోసిన్ పోసి నిప్పంటించబోయాడని తెలిసింది. అలాగే ఇతనిపై పోలీస్స్టేషన్లో కూడా చోరీ కేసులు ఉన్నాయని తెలిసింది.