జగన్ సర్కార్ కు సెమీ ఫైనల్ గా టీచర్ ఎమ్మెల్సీ పోరు ? ఉద్యోగుల పల్స్ తేలిపోతుందా ?
ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన విద్యాసంస్కరణలు, జీతాల చెల్లింపులో సమస్యలు, ఉద్యోగ హామీల అమల్లో వెనుకబాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే ఏడాది ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మార్చేస్తున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వెనుక ఉద్యోగుల పాత్ర కూడా ఎంతో ఉంది. అయితే అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదన్న ఆవేదన కూడా వారిలో అంతే ఉంది. అదే సమయంలో పోరాటాలు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారన్న ఆక్రోశం కూడా పెరుగుతుండటంతో త్వరలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో ఉద్యోగుల పల్స్ ను ఇవి తేల్చబోతున్నాయి.

ఏపీ టీచర్ ఎమ్మెల్సీ పోరు
ఏపీలో త్వరలో రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒకటి ప్రకాశం - నెల్లూరు -చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. రెండోది కడప -అనంతపురం -కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ రెండు ఎన్నికలూ దాదాపుగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి. ఆరు ఉమ్మడి జిల్లాలు, ప్రస్తుత జిల్లాల వారీగా చూస్తే దాదాపు 11 జిల్లాల్ని ఇవి కవర్ చేయబోతున్నాయి. ఆయా జిల్లాల్లో ఉపాధ్యాయుల పల్స్ వీటితో తేలబోతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

వైసీపీ వర్సెస్ పీడీఎఫ్ పోరు
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానంలో ప్రస్తుతం కత్తి నరసింహారెడ్డి సిట్టింగ్ గా ఉన్నారు. అలాగే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరిద్దరి పదవీకాలం మార్చితో ముగియబోతోంది. దీంతో వీరు మరోసారి పోటీలో నిలవబోతున్నారు. వీరికి పోటీగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానంలో వైసీపీ అభ్యర్ధిగా ఎం.వి.రామచంద్రారెడ్డి, అలాగే తూర్పు రాయలసీమ స్ధానంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. వీరిద్దరి గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది.

ఉపాధ్యాయుల వ్యతిరేకత వేళ
ఏపీలో వైసీపీ సర్కార్ పై ఉపాధ్యాయులు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా విద్యాసంస్కరణల పేరుతో ఇబ్బందులు పెడుతోందని, బలవంతంగా టీచర్లను నాడు-నేడు పనుల్లో భాగస్వాముల్ని చేస్తోందని, ఇంగ్లీష్ మీడియాన్ని తమపై రుద్దుతోందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదని టీచర్లు గుర్రుగా ఉన్నారు. వీటిపై ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా అణగదొక్కుతున్నారన్న ఆవేదన కూడా టీచర్లలో పెరుగుతోంది. ఎన్నికల విధులకు వారిని దూరం చేయడం కూడా టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.

జగన్ సర్కార్ కు సెమీ ఫైనల్స్ ?
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికైతే సంక్షేమ పాలన కారణంగా లబ్దిదారులంతా వైసీపీకే తిరిగి ఓటు వేస్తారన్న అంచనాలున్నాయి. అదే సమయంలో ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగులు మాత్రం సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా గొంతెత్తే అవకాశం లేకుండా చేస్తున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. టీచర్లపై ఇతర ఉద్యోగుల ప్రభావం, మద్దతు కూడా ఉంది. దీంతో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరంతా కలిస్తే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అంచనాలున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలతో ఉద్యోగుల పల్స్ తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ పోరును జగన్ సర్కార్ కు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications